హైదరాబాద్, నవంబర్ 16 :
భారత మీడియా రంగాన్ని పూర్తిగా మార్చిన దూరదృష్టి కలిగిన మహానేత, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రామోజీరావు అని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈనాడు గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ late రామోజీరావు పేరుతో ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఈ పురస్కారాలను ఈ ఏడాది ఏడు విభాగాల్లో ప్రముఖులకు ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలు: అమలా అశోక్ రుయా (గ్రామీణ అభివృద్ధి), శ్రీకాంత్ బొల్లా (యూత్ ఐకాన్), మాధవి లతా గాలి (సైన్స్ & టెక్నాలజీ), ఆకాశ్ టాండన్ (సర్వీస్ టు మాన్కైండ్), సతుపతి ప్రసన్నశ్రీ (కళా సాంస్కృతిక విభాగం), జైదీప్ హర్డీకర్ (జర్నలిజం), పల్లబి ఘోష్ (ఉమెన్ అచీవర్).
కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ, రామోజీ గ్రూప్ సీఏండీ కిరణ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామోజీ బ్రాండ్ వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకించి రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచ స్థాయి చిత్ర నిర్మాణ కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. రామోజీ గ్రూప్ విలువలను, పరంపరలను నిబద్ధంగా కొనసాగిస్తున్నందుకు అభినందించారు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్ నాల్గవ అద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ అని పేర్కొన్నారు.
కేవలం ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చి, పూర్తిస్థాయి సినిమా కాపీతో బయటికి వెళ్లే సౌకర్యాలను కల్పించిన వ్యక్తి రామోజీరావు మాత్రమేనని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రామోజీరావు ఇచ్చిన ప్రేరణతో తెలుగు భాషను కాపాడుతానని చెప్పారు. రామోజీరావు అద్భుతమైన ప్రతిభకు ప్రతీక అని, సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా ఎదిగిన అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు.
రామోజీరావుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గరా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చిన్న కోరిక కూడా పెట్టుకోలేదని గుర్తుచేశారు.
"ప్రజల కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా, అవినీతి ఎదుట ఆయన కలం శక్తిగా నిలిచేది. వ్యతిరేక పక్షం బలహీనంగా ఉన్నప్పుడల్లా, రామోజీరావే ప్రజల తరఫున ప్రతిపక్షంలా వ్యవహరించేవారు" అని చంద్రబాబు నాయుడు అన్నారు.