ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువుల అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) మరింత వేగవంతం చేయబోతోంది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో రూ.8,110 కోట్ల భారీ పెట్టుబడితో కోనసీమ ప్రాంతంలో 172 కొత్త బావులను తవ్వేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఇటీవల షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది.
కోనసీమలో ఓఎన్జీసీకి కేటాయించిన 8 పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో ఈ తవ్వకాలు జరగనున్నాయి. మొత్తం వ్యయంలో పర్యావరణ నిర్వహణ ప్రణాళికకు రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలకు రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
అయితే, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కమిటీ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. తవ్వే బావులు ఏవీ కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధి (10 కిమీ) లో ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే, పైప్లైన్లు అటవీ లేదా సంరక్షిత ప్రాంతాల గుండా వేయాల్సి వస్తే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది.
కోనసీమలో చమురు క్షేత్రాల వల్ల భూమి కుంగిపోతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది.
కేజీ బేసిన్లో సుమారు 69.8 కోట్ల టన్నుల చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. దేశీయ ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి.
పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నప్పటికీ, చమురుకు డిమాండ్ తగ్గదని, 2050 నాటికి దాదాపు రెట్టింపు అవుతుందని బ్రిటిష్ పెట్రోలియం (BP) నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి పెంచేందుకు ఓఎన్జీసీ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది.