నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (80) కన్నుమూత
నాగాలాండ్ గవర్నర్, బీజేపీ మాజీ ఎంపీ ఎల్. గణేశన్ (80) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఈ నెల 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలి తలకు తీవ్రమైన గాయమై ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూనే ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.
ఈ రోజు (శనివారం) ఆయన భౌతికకాయాన్ని టీ.నగర్లోని నివాసంలో రాజకీయ నాయకులు, బంధువులు, అభిమానులు చివరి చూపు చూసేందుకు ఉంచనున్నారు. అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించనున్నారు.
1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. కుటుంబం కూడా సంఘ్తో అనుబంధం కలిగినందున 1970లో పూర్తి స్థాయి ప్రచారక్గా మారారు. మధురై సహా అనేక ప్రాంతాల్లో రెండు దశాబ్దాలపాటు సేవలందించి, 1991లో బీజేపీలో చేరి తమిళనాడు సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు.
తర్వాత జాతీయ స్థాయిలో పలు హోదాల్లో సేవలందించారు. 2006–2009 మధ్యకాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021లో మణిపూర్ గవర్నర్గా నియమితులై, 2023లో కొంతకాలం పశ్చిమ బెంగాల్ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేయడంలో తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాది గణేశన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని, తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు.