20 బిలియన్ డాలర్లకు చేరిన భారత సైబర్ సెక్యూరిటీ పరిశ్రమ
ఏఐ – రెండు వైపులా పదునైన కత్తి లాంటిదన్న సెర్ట్-ఇన్
గతేడాది 147 రాన్సమ్వేర్ దాడుల నమోదు
సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో సెర్ట్-ఇన్ కీలక పాత్ర
భారత్ వేగంగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్గా అవతరిస్తోందని, ఈ రంగంలో 400కు పైగా స్టార్టప్లు, 6.5 లక్షల నిపుణుల నైపుణ్యంతో దేశ సైబర్ భద్రతా పరిశ్రమ 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సెర్ట్-ఇన్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహల్ తెలిపారు.
యూరోపియన్ యూనియన్ జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన, థ్రెట్ డిటెక్షన్, సైబర్ ఫోరెన్సిక్స్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి పరిష్కారాలు భారత ఆవిష్కర్తలు అభివృద్ధి చేస్తున్నారని, ఇది సురక్షితమైన డిజిటల్ వాతావరణ నిర్మాణానికి కీలకమని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని ఆయన అన్నారు. ఇది రక్షణ వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుందో, దాడి చేసే సైబర్ నేరగాళ్లకు కూడా అంతే సహాయకమని తెలిపారు. సైబర్ దాడులను గుర్తించడం, నివారించడం, ప్రతిస్పందించడం కోసం సెర్ట్-ఇన్ ఏఐ ఆధారిత విశ్లేషణలను, ఆటోమేషన్ను వినియోగిస్తోందని చెప్పారు.
గతేడాది దేశంలో 147 రాన్సమ్వేర్ దాడులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. తక్షణ చర్యలు, ఫోరెన్సిక్ జోక్యం, ఇంటెలిజెన్స్ మార్పిడి వల్ల వాటి ప్రభావం తగ్గించగలిగామని చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత స్టార్టప్లకు ప్రభుత్వం పాలసీ మద్దతు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఫ్రాన్స్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (ANSSI) వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ పటిష్ఠమైన సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నామని అధికారులు వెల్లడించారు.