మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసే వారికి శుభవార్త. ఇకపై కేవలం సిబిల్ స్కోర్ (క్రెడిట్ హిస్టరీ) లేదని బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించలేవు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
లోక్సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ కీలక ప్రకటన చేశారు. బ్యాంకులు, రుణ సంస్థలు (NBFCs) కొత్త రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ లేకపోవడం ఒక్క కారణంగా రుణం ఇవ్వకూడదని ఆర్బీఐ స్పష్టమైన సూచనలు జారీ చేసింది అని తెలిపారు.
అలాగే, రుణాల మంజూరుకు ఆర్బీఐ ఎలాంటి కనీస క్రెడిట్ స్కోర్ను నిర్దేశించలేదని మంత్రి వెల్లడించారు. బ్యాంకులు తమ విధానాలు, వాణిజ్య అంశాలు, మరియు అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
క్రెడిట్ రిపోర్ట్ ఒక ముఖ్యమైన పత్రం అయినప్పటికీ, అది ఒక్కటే తుది ప్రమాణం కాదని ఆయన అన్నారు. అభ్యర్థి రుణ చెల్లింపు సామర్థ్యం, గత రుణ చరిత్ర, రైట్ ఆఫ్స్ లేదా సెటిల్మెంట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
అదేవిధంగా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CICs) ఒక్క క్రెడిట్ రిపోర్ట్ కోసం ₹100 కంటే ఎక్కువ వసూలు చేయరాదని మరియు ప్రతి వ్యక్తి ఏటా ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందే హక్కు ఉందని గుర్తు చేశారు.
ఈ నిర్ణయం కొత్త రుణగ్రహీతలకు భారీ ఊరట కలిగించనుంది మరియు మరింత మంది ఫార్మల్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి దోహదపడనుంది.