ఆంధ్రప్రదేశ్: మంచిరోజులు వచ్చాయి... విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత బలోపేతం! కేంద్ర బృందంతో సీఎం సమీక్ష

విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం – సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతి కోసం అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం తిరిగి తెచ్చేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం కోసం కీలక సూచనలు చేయడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. “విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు” నినాదాన్ని ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వం ప్లాంట్ అభివృద్ధి కోసం కార్యాచరణను వేగవంతం చేస్తోంది.

కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ, ఉన్నతాధికారుల బృందంతో కలిసి అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి కీలక చర్చలు జరిపారు. ఏపీ ప్రజలకు భావోద్వేగంగా అనుబంధం ఉన్న ఈ ఉక్కు పరిశ్రమను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో రివైవల్ ఫండ్ వినియోగం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ప్లాంట్ భద్రత అంశం కూడా చర్చకు వచ్చింది. CISF భద్రతను రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (SPF) భద్రతతో మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని, సామర్థ్యం పెంచితే మంచి ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెండు బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, మూడో ఫర్నేస్‌ను తిరిగి ప్రారంభించేందుకు కూడా చర్చలు జరిగాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో ఉన్నందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book