ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ జూలైలో ప్రారంభం కానుంది
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు మే 10న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,20,326 మంది దరఖాస్తు చేయగా, 2,07,190 మంది పరీక్షలు రాశారు. ఇందులో 1,51,779 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 73.26 కాగా, బాలికలు 73.88 శాతం, బాలురు 72.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో 81,198 మంది పరీక్షలు రాయగా, 71,309 మంది విద్యార్థులు (87.82%) అర్హత సాధించారు. బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29, 30 (అగ్రికల్చర్) మరియు మే 2, 3, 4 (ఇంజినీరింగ్) తేదీల్లో జరిగాయి.
సాధారణంగా ఫలితాల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ వెంటనే విడుదలవుతుంది. కానీ ఈ సంవత్సరం జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో మాత్రమే కౌన్సెలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల తర్వాత జోసా కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. అగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్ తరగతులు మొదలవుతాయి.