చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటన – యోగా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ పర్యటన జరుగుతుంది.
అధికారిక సమాచారం ప్రకారం, సీఎం ఉదయం 10:40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్లో కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం మరియు నోవాటెల్ హోటల్ ప్రాంతాల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం, పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరుగనున్న టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా దినోత్సవానికి ప్రజలను ఎలా సమీకరించాలో నేతలకు మార్గదర్శనం చేస్తారు.
తర్వాత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు తిరుగు పయనం అవుతారు.
ఈ పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు మరియు ఉన్నతాధికారులు విశాఖలో ఉన్నారు. మంత్రులు పార్థసారథి మరియు డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఇప్పటికే ఆదివారం అక్కడకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించినట్టుగా, విశాఖపట్నాన్ని ఆర్థిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో జూన్ 17 నుంచి 21 వరకు విశాఖలో తాత్కాలిక రెడ్ జోన్ ప్రకటించారు. దీనితో నగర భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.