పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్, భారత విమానాలకు తమ గగనతలాన్ని ఉపయోగించేందుకు నిషేధం విధించింది. ఈ పరిణామంతో, భారత్ నుంచి పలు దేశాలకు బయలుదేరే విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా అమెరికా వెళ్లే విమానాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వారానికి మొత్తం 71 విమాన సర్వీసులు నడుపుతోంది. వాటిలో 54 సర్వీసులు ఢిల్లీ నుంచే ఉన్నాయి. కానీ అరేబియా సముద్రం మార్గం వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, ఇంధన వ్యయం, సిబ్బంది పని గంటలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ కారణంగా ఎయిర్ ఇండియా సాంకేతికంగా ఇంధనం నింపేందుకు యూరప్లోని వియన్నా (ఆస్ట్రియా), కోపెన్ హాగెన్ (డెన్మార్క్) నగరాల్లో టెక్నికల్ స్టాప్లు ఏర్పాటు చేసుకుంది. దీనివల్ల ల్యాండింగ్ ఛార్జీలు, ఫ్యూయల్ ఖర్చులు భారీగా పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో టెక్నికల్ స్టాప్లను భారత్లోనే ఏర్పాటు చేస్తే వ్యయాలను తగ్గించుకోవచ్చని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ముంబయి లేదా అహ్మదాబాద్ నగరాలను టెక్నికల్ స్టాప్లుగా పరిశీలిస్తోంది. ఇలా చేస్తే యూరప్ నగరాల్లో ఆగాల్సిన అవసరం లేకుండా విమానాలు నేరుగా అమెరికా చేరే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తమ సిబ్బందికి శుక్రవారం ఓ కీలక సమాచారం అందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్గాల్లో తాత్కాలిక మార్పులు అమల్లో ఉన్నాయని తెలిపారు. టెక్నికల్ స్టాప్లను తగ్గించడమే తమ ప్రాధాన్య లక్ష్యమని, ఇందులో ఇప్పటికే కొంత పురోగతి సాధించామని పేర్కొన్నారు.