గజగజ వణుకుతున్న తెలంగాణ.. మరింత పెరగనున్న చలి తీవ్రత
తెలంగాణ రాష్ట్రం చలి గాలులతో వణికిపోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుండగా, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉత్తర, ఈశాన్య గాలులు తెలంగాణ వైపు వీస్తుండటమే ఈ చలి తీవ్రతకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం హనుమకొండలో 16°C, పటాన్చెరులో 13.2°C, మెదక్లో 14.1°C, హైదరాబాద్లో 16.9°C, ఆదిలాబాద్లో 14.2°C, హయత్నగర్లో 15.6°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాత్రిపూటే కాకుండా పగటిపూట కూడా చలి ప్రభావం పెరిగింది. రామగుండంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29°Cగా, నిజామాబాద్లో 30.2°Cగా, హైదరాబాద్లో 29.2°Cగా నమోదైంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.