ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అవుతున్న వారిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు అంగీకరిస్తూ, ఏపీ సర్కార్ ఈ బదిలీ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా పలువురు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అయితే వీరిలో 58 మంది ఉద్యోగులు తెలంగాణనే తమ ఆప్షన్గా ఎంచుకున్నప్పటికీ, పరిపాలనా కారణాల వల్ల ఏపీలోనే ఉండిపోయారు.
కొంతమంది అవగాహన లోపం వల్ల, మరికొందరు కారుణ్య నియామకాల కింద తెలంగాణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల వీరు ఏపీలోనే కొనసాగారు.
తమను సొంత రాష్ట్రానికి పంపించాలని చాలాకాలంగా కోరిన ఈ ఉద్యోగుల అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలించింది. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, కొన్ని నిబంధనలకు అంగీకారం తెలుపుతూ, వీరిని రిలీవ్ చేస్తూ జీఏడీ (GAD) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కూడా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 698 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో మిగిలిన 58 మంది కూడా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సర్వీసులో చేరనున్నారు.