అమరావతి, మే 4: ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఈ నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. మొదటగా పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 15 నుంచి 22 వరకు అనుమతించారు. అయితే తాజాగా ఇంటర్ విద్యామండలి ఫీజు చెల్లింపుకు గడువును మే 5వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటన చేశారు. ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని, ఇది చివరి అవకాశం అని ఆమె తెలిపారు. మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
Andhra Pradesh
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2025: పరీక్షల ఫీజు గడువు పొడిగింపు – కొత్త తుది తేదీ ఇది!
