న్యూఢిల్లీ, జూన్ 18: విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలో భారత నౌకాదళం ఐఎన్ఎస్ అర్నాలా ను బుధవారం నాడు అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇది భారతదేశంలో స్వదేశీగా రూపకల్పన చేసి నిర్మించిన తొలి యాంటీ-సబ్మెరిన్ వార్షిప్ (ASW Shallow Water Craft).
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన నౌకాదళ ప్రధాన కార్యాలయ ప్రతినిధి తన సోషల్ మీడియా ఖాతా ‘X’ (మాజీ ట్విట్టర్)లో, అర్నాలా నౌక రూపకల్పన నుండి యుద్ధ నౌకగా మారిన ప్రయాణాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. “భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్మేరిన్ వార్షిప్ నేడు జూన్ 18, 2025 న ఆవిష్కరించబడుతోంది. బ్లూప్రింట్ నుండి వార్షిప్ వరకు అర్నాలా ప్రయాణం మీకు అందిస్తున్నాం” అని నౌకాదళం పేర్కొంది.
అర్నాలా భారత నౌకాదళం కోసం రూపొందించిన ఎనిమిది ASW SWC నౌకల్లో మొదటిది. దీన్ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE) రూపొందించగా, ఎల్ అండ్ టీ షిప్యార్డ్, కట్టుపల్లి వద్ద మే 8న భారత నౌకాదళానికి అప్పగించారు.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ నౌకను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (IRS) నిబంధనల ప్రకారం నిర్మించారు. ఇది GRSE మరియు ఎల్ అండ్ టీ షిప్యార్డ్ ల మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగిన కలసికట్టైన రక్షణ నిర్మాణ విజయాన్ని సూచిస్తుంది.
ఈ నౌకకు మహారాష్ట్రలోని వసాయి సమీపంలో ఉన్న చారిత్రాత్మక అర్నాలా కోట పేరును పెట్టడం, భారత సముద్ర వారసత్వానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
77 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌక, డీజిల్ ఇంజిన్-వాటర్జెట్ కలయికతో నడిచే భారత నౌకాదళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక.
ఈ నౌకను అండర్వాటర్ నిఘా, శోధన మరియు రక్షణ కార్యక్రమాలు, తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలు (LIMO) కోసం రూపొందించారు. అలాగే, తీర ప్రాంతాలలో యాంటీ-సబ్మేరిన్ కార్యకలాపాలు మరియు మైన్ లేయింగ్ సామర్థ్యం కూడా దీనికి ఉంది.
ఈ రకం ASW SWC నౌకలతో భారత నౌకాదళం తక్కువ లోతు నీటి యాంటీ-సబ్మేరిన్ సామర్థ్యాన్ని భారీగా మెరుగుపరుచుకోనుంది.
ప్రభుత్వ ప్రకటనలో, “అర్నాలా డెలివరీ భారత నౌకాదళం స్వదేశీ నౌక నిర్మాణ లక్ష్యానికి మరో మైలురాయి. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా 80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్తో ముందడుగు” అని పేర్కొంది.