జాతీయ రహదారి పనుల జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణాల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన అనుమతులు సమయానికి ఇస్తున్నప్పటికీ, పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఇకపై గడువులోగా ప్రాజెక్టులు పూర్తవాల్సిందేనని స్పష్టం చేశారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చ నిర్వహించారు. పనుల్లో ఆలస్యం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు కేంద్రాన్ని కోరతానని హెచ్చరించారు.
ప్రత్యేకంగా బెంగళూరు - కడప - విజయవాడ జాతీయ రహదారిలోని కోడూరు క్రాస్ - కడప - ముప్పవరం ప్యాకేజీలో పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రహదారి పనుల్లోనూ ఆలస్యం జరగకూడదు అని స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ మరియు వన్యప్రాణి అనుమతుల సమస్యలను జులై నాటికి పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.