AP DSC Sports Quota 2025: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 3,411 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల సమర్పణకు మే 31తో గడువు ముగియనున్న..
అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 3,411 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల సమర్పణకు మే 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో జూన్ 1 నుంచి క్రీడాకారులు సమర్పించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మొదలు కానున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలోని ఉద్యోగాలకు రాత పరీక్షలేకుండా నేరుగా అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు ఇప్పటివరకు ఉన్న 2 శాతం రిజర్వేషన్ను కూటమి సర్కార్ 3 శాతానికి పెంచింది. కాగా ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా కింద అర్హుల ఎంపికకు మే 2న నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర, జోన్, జిల్లాల వారీగా ఈ పోస్టులను కేటాయించనున్నారు. ఇప్పటి వరకు వివిధ క్రీడలకు సంబంధించి మొత్తం 2,251 మంది క్రీడాకారులు దాదాపు 3,411 దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పోస్ట్లకు దరఖాస్తులు చేయడంతో వీటి సంఖ్య పెరిగింది. మే 31న తుది గడువు సమయం నాటికి 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగ అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయవల్సి ఉంటుంది. వీటి పరిశీలన జూన్ 1న మొదలై మొత్తం 30 రోజులపాటు కొనసాగుతుంది.
క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు. అనంతరం జులై 1 నుంచి ఏడు రోజలపాటు వీటిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పది రోజుల్లో అభ్యంతరాలు పరిష్కరించి తుది జాబితాను విడుదల చేస్తారు. అభ్యర్థుల తుది జాబితాను క్రీడల శాఖ ఆమోదించిన తర్వాత నియామకాల కోసం విద్యా శాఖకు పంపనున్నారు. ఆపై విద్యాశాఖ తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తుంది.